ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రగతికి సరికొత్త ప్లాన్తో దూసుకుపోతున్నారు. గోదావరి తీర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఆయన తాజాగా మరో రూ.100 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించారు. ఈ కేటాయింపుల ద్వారా గోదావరి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో మౌలిక వసతుల కొరతను పూర్తిగా తీర్చేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ తాజా నిధులను ప్రధానంగా గ్రామీణ రహదారుల నిర్మాణం, ఆధునీకరణతో పాటు తాగునీటి సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా, పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు రూ.90 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో గోదావరి తీర పరిధిలోకి వచ్చే ఏడు కీలక నియోజకవర్గాల్లో పాడుబడిన గ్రామీణ లింక్ రోడ్లను, ప్రధాన రహదారులను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల వందలాది గ్రామాలకు రవాణా కనెక్టివిటీ భారీగా మెరుగుపడనుంది.
మరోవైపు, వేసవి కాలంలో మరియు సాధారణ రోజుల్లో తీర ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం నుండి మరో రూ.10 కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేయించారు. ఈ నిధులతో కొత్త పైప్లైన్ల ఏర్పాటు, రక్షిత మంచినీటి ప్లాంట్ల మరమ్మతులు చేపట్టనున్నారు. నిజానికి గోదావరి కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా పవన్ కళ్యాణ్ రూ.100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మళ్లీ రూ.100 కోట్లు తీసుకురావడంతో గోదావరి తీరంలో అభివృద్ధి పనులు శరవేగంగా పుంజుకోనున్నాయి.






