కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆటిజం చికిత్స కోసం స్టెమ్ సెల్ థెరపీని సాధారణ లేదా కమర్షియల్ పద్ధతిలో వాడటంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిన తాజా అడ్వైజరీలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్స్ లో మాత్రమే దీనిని ఉపయోగించడానికి అనుమతి ఉంటుందని కేంద్రం పేర్కొంది.
సెప్టెంబర్ 16న విడుదల చేసిన ఈ అధికారిక ప్రకటన ప్రకారం, కేవలం కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే స్టెమ్ సెల్ థెరపీని ప్రామాణిక చికిత్సగా వాడేందుకు అనుమతి ఉంది. ఆటిజం బాధితులకు ఎలాంటి నిరూపణ లేని స్టెమ్ సెల్ చికిత్సలను కమర్షియల్ సేవలుగా అందించడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని కేంద్రం హెచ్చరించింది. ఈ తరహా పరిశోధనలు లేదా చికిత్సలు ఏవైనా సరే నేషనల్ గైడ్లైన్స్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్-2017 నిబంధనలకు లోబడే జరగాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నిబంధనలను ఉల్లంఘించే క్లినిక్లు, వైద్యులపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. నిబంధనలు పాటించని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. నేషనల్ మెడికల్ కమిషన్ కూడా దీనిపై స్పందిస్తూ, అనుమతించని వ్యాధులకు స్టెమ్ సెల్ థెరపీని ప్రమోట్ చేయడం లేదా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందికే వస్తుందని స్పష్టం చేసింది.






