ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో అత్యాధునిక ‘గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్’ మరియు మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు కోసం రక్షణ రంగ ప్రభుత్వ దిగ్గజ సంస్థ ‘మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్’ తో ఏపీ ప్రభుత్వం కీలకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సచివాలయంలో ఎండీఎల్ మరియు నేషనల్ షిప్బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్-ఏపీ ప్రతినిధులు ఈ పత్రాలను మార్చుకున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా రాబోయే ఐదు నుండి ఏడేళ్ల వ్యవధిలో రూ. 15,000 కోట్ల భారీ పెట్టుబడులు రానుండటమే కాకుండా, రాష్ట్రంలో సుమారు 45,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రతిపాదిత దుగరాజపట్నం గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ ఏడాదికి 12 లక్షల టన్నుల భారీ నౌకల నిర్మాణ సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది.
కేంద్ర ప్రభుత్వ ‘షిప్బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్’ కింద నిర్మితమయ్యే ఈ యాంకర్ షిప్యార్డ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్లు మరియు ఎల్ఎన్జీ నౌకల నిర్మాణంతో పాటు నౌకల మరమ్మతు సేవలను కూడా అందించనున్నారు. దుగరాజపట్నం పోర్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, తాజా ఒప్పందంతో ఈ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద మారిటైమ్ ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోందని, 2047 నాటికి ప్రపంచంలోని టాప్-5 నౌకా నిర్మాణ దేశాలలో ఒకటిగా ఎదగాలన్న భారత లక్ష్యానికి ఏపీ వెన్నుముకగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.






