వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలే పలు పోలీస్ కేసులు, రిమాండ్ ఎదుర్కొన్న అంబటి రాంబాబుకు, ఇప్పుడు ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడం పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఈడీ అధికారులు ఈ నోటీసులకు సంబంధించిన వివరాలను తాజాగా ఫోన్ ద్వారా అంబటి రాంబాబుకు తెలియజేశారు.
విచారణ నిమిత్తం వాస్తవానికి ఈ నెల 11వ తేదీనే హాజరుకావాలని తాము ఇదివరకే నోటీసులు జారీ చేశామని అధికారులు ఈ సందర్భంగా ఆయనకు స్పష్టం చేశారు. అయితే, అధికారులు చెప్పిన ఆ సమాచారం గానీ, ఆ నోటీసులు గానీ తనకు ముందే అందలేదని అంబటి రాంబాబు అధికారులకు బదులిచ్చారు. నోటీసులు అందలేదన్న మాజీ మంత్రి సమాధానంపై స్పందించిన ఈడీ అధికారులు, విచారణకు సంబంధించి తదుపరి ప్రక్రియను వేగవంతం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తక్షణమే నిబంధనల ప్రకారం విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని అంబటి రాంబాబుకు అధికారులు ఆదేశించారు.
ఏ విషయమై ఈ నోటీసులు ఇచ్చారనే పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రావలసి ఉంది. ఈడీ నోటీసుల వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై మరో కేసు పెట్టేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. వైపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా ఈ తరహా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాగా, ఇప్పటికే పలు వివాదాలు, కేసులతో 18 రోజుల పాటు రిమాండ్లో ఉన్న అంబటికి, ఈ ఈడీ నోటీసులు ఎటు దారితీస్తాయోనన్న ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్స్లో నెలకొంది.






