అభివృద్ధికి ప్రజలు పట్టం గడితే చంద్రబాబు ఈ దేశంలో సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి అయి వుండేవారు. ఇది అతిశయోక్తి కాదు. 24 ఏళ్ల పై చిలుకు ముఖ్యమంత్రులుగా చేసిన నవీన్ పట్నాయక్, పవన్ కుమార్ చామ్లింగ్ ని దాటేసేవారు. కానీ ప్రజలు డెవలప్మెంట్ కంటే మిగతా విషయాలకు ప్రాధాన్యమిస్తారు. డెవలప్మెంట్ కు లీస్ట్ ప్రయారిటీ ఇవ్వడం తెలుగు ప్రజలకు అలవాటు. అందువల్లే చంద్రబాబు మూడుసార్లు ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. రాష్ట్రాన్ని గట్టెక్కించడంతో పాటు, హైదరాబాద్ ని ఐటి, బయోటెక్ రంగాల హబ్ గా మార్చారు.
ఆయన తీసుకొచ్చిన ఐటి విప్లవం ఉమ్మడి రాష్ట్రంలో లక్షల మంది ఐటి ఇంజనీర్లని తయారు చేసింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాల స్థితి గతులు మారిపోయాయి. రాష్ట్ర విభజన తరువాత ఇరిగేషన్ కు ప్రాధాన్యమిచ్చారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తి చెయ్యడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మధ్యలో జగన్ రావడం మూలంగా అమరావతి ఆగిపోయింది. పోలవరం ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ అన్నిప్రాజెక్టులు ఊపందుకున్నాయి. హంద్రీ నీవా ద్వారా క్రిష్ణమ్మ జలాలు రాయలసీమకు చివరన వున్న కుప్పం నియోజకవర్గం వరకు తీసుకెళ్లారు. వెలిగొండ తొలిదశని ప్రారంభించి జాతికి అంకితం చేసి పశ్చిమ ప్రకాశాన్ని పరవశింపచేశారు.
ఇప్పుడు ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో తడపబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సాగునీటి కలని నిజం చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ స్పీడందుకున్నాక, ఇక ఆగేదేలేదన్నట్టుగా వరుస ప్రాజెక్టుల ప్రారంభాలతో బాబు మంచి వూపు మీద ఉన్నారు. ఇప్పడీ పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాల్లో 3 లక్షల 80 వేల ఎకరాలకు సాగునీరందుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు విజయవంతంగా చేరుకున్నాయి. ఈ రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని పీఎల్ పురం గ్రామం వద్ద ఈ పవిత్ర గోదావరి జలాలకు సాంప్రదాయబద్ధంగా “జలహారతి” సమర్పించి అధికారికంగా నీటిని విడుదల చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు తొలిదశ 2027 మార్చి కి పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ లోపే ఎడమ కాలవ నుంచి ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు ఇవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఇందుకోసం పురుషోత్తపట్నం, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పంపింగ్ ఏర్పాట్లను ఉపయోగించుకుని, ఎడమ కాలువ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు.పుష్కర ఎత్తిపోతల నుంచి 1400 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం నుంచి 3,500 క్యూసెక్కులు ఎత్తిపోస్తారు. మధ్యలో 24 టిఎంసి కెపాసిటీ వున్న ఏలేరు జలాశయాన్ని కూడా నింపుతారు. దాదాపు 213 కిలోమీటర్ల పొడవున్న ఈ పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం కోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 4,192 కోట్లు ఖర్చు చేసింది.
2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడమ కాలువకు సంబంధించిన భూసేకరణ, మిగిలిపోయిన లింక్ పనులు, లైనింగ్ పనులను శరవేగంగా పూర్తి చేశారు. 2004 నుంచి ఇప్పటి వరకు దీనికయిన ఖర్చు 4 వేల200 కోట్లు. 2014 19 మధ్య బాబు ప్రభుత్వం పెట్టిన ఖర్చు 923 కోట్లు. కూటమి వచ్చాక ఈ రెండేళ్లలో 1700 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మొత్తం 2,600 కోట్లు బాబు హయాంలో ఖర్చు పెట్టారు. మిగతా 1400 కోట్లలో వైఎస్ఆర్ హయాంలో 430 కోట్లు, రోశయ్య, కిరణ్ హయాంలో 570 కోట్లు, జగన్ హయాంలో 400 కోట్లు ఖర్చు పెట్టారు.
ఈ ఎడమకాలువ నీటిని వ్యవసాయానికే కాకుండా పారిశ్రామిక అవసరాలకి కూడా వాడతారు. దీని వల్లఉత్తరాంధ్ర పారిశ్రామికంగా కూడా అభివ్రుద్ధి చెందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 లక్షల 17 వేల ఎకరాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,63 వేల ఎకరాలకు సాగునీరు, 9 లక్షలమందికి తాగునీరు అందుతుంది. ఎడమ కాలువ కింద వున్న143 గ్రామాలకు స్వచ్ఛమైన తాునీరు అందుతుంది. ఫార్మా సిటీ, స్టీల్ ప్లాంట్, అనకాపల్లి, గాజువాక పరిసరాల్లో పెరుగుతున్న పరిశ్రమల నీటి అవసరాలు తీరుస్తుంది. ఉత్తరాంధ్రని ప్రగతి పథంలో నడిపించడానికి ఇది కీలకమైన చోదకశక్తి అనడం ఎలాంటి సందేహం లేదు.
రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ని విజయవంతంగా ప్రారంభించిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నారు. పోలవరం తొలి దశని 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్తున్నారు. వెలుగొండ రెండో దశని 2028 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించి మంచి దూకుడు మీదున్నారు. 2028 డిసెంబరు నాటికి నీటిపారుదల ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం పూర్తయితే రాష్ట్రం దశ, దిశ మారిపోతాయి. జగన్ హయాంలో అభివృద్ధి విషయంలో జరిగిన వెనకబాటుని అధిగమించినట్లవుతుంది.






