గ్లోబల్ వెదర్ గండం ‘ఎల్ నినో’ ప్రభావంతో ఈ ఏడాది తీవ్రమైన వర్షపాత లోటు, కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు మన శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. జూన్ నెలలో దేశవ్యాప్తంగా నమోదైన రికార్డు స్థాయి ఎండలు, పొడి వాతావరణం ఈ భయాలను నిజం చేశాయి. అయితే, ఊహించని విధంగా బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు మరియు వాయుగుండాలు ప్రకృతాన్నే శాసిస్తూ ఎల్ నినో తీవ్రతను క్రమంగా నొక్కిపెడుతున్నాయి. తాజాగా ఉత్తర అండమాన్ తీరంలో ఏర్పడుతున్న మరో అల్పపీడనం ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు పెద్ద ఊరటనిచ్చేందుకు సిద్ధమవుతోంది.
భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, ఉత్తర థాయిలాండ్ మీదుగా వచ్చిన ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ప్రవేశించి, ఈరోజు సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనంగా మారనుంది. ఇది రానున్న 4 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, మరింత బలపడి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకురానుంది. ఎల్ నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడే ప్రతిసారీ.. ఇటువంటి అల్పపీడన వ్యవస్థలు బంగాళాఖాతం నుండి భారీ తేమను దేశ ప్రధాన భూభాగంలోకి లాక్కురావడం ద్వారా వర్షాలను సమృద్ధిగా కురిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ సరికొత్త వాతావరణ మార్పుల ప్రభావంతో ఈరోజు నుంచే ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, ప్రజలు మరియు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.














