ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం మాత్రం మారలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న విభిన్న ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రజలను విడదీసి రాజకీయ లబ్ధి పొందాలనే వారి కుట్రలు మరీ బాధాకరంగా మారుతున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్లో లేనిపోని విషాన్ని నింపి, వారిని కోస్తా ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా ఉసిగొలిపేందుకు వైసీపీ నేతలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణే తిరుపతి ఎంపీ గురుమూర్తి సోషల్ మీడియాలో చేసిన ఒక దిగజారుడు ట్వీట్. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య ద్వేషాన్ని పెంచడమే లక్ష్యంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ కుట్రపూరిత వైఖరిని మరోసారి రాష్ట్ర ప్రజల ముందు బట్టబయలు చేశాయి.
ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే NIELIT విషయంలో కూడా వైసీపీ నేతలు సరిగ్గా ఇదే తరహా తప్పుడు ప్రచారానికి తెరలేపారు. “తిరుపతిలో ఏర్పాటు చేయాల్సిన NIELIT కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం అమరావతికి తరలించేసింది” అంటూ ప్రజలను నమ్మించేందుకు పెద్ద ఎత్తున అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తు ఒక ఎంపీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. కానీ, ఈ అసత్య ప్రచారాల వెనుక ఉన్న అసలు నిజాన్ని NIELIT అధికారిక వెబ్సైట్ స్పష్టంగా బయటపెట్టింది. నిలిట్ అధికారిక పోర్టల్ను ఓపెన్ చేసి చూస్తే… తిరుపతిలోని NIELIT కేంద్రం ఎక్కడికీ తరలిపోలేదని, అది ఇప్పటికీ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్లోనే విజయవంతంగా కొనసాగుతోందని వివరాలతో సహా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
అసలు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో అర్థం చేసుకోకుండా వైసీపీ నేతలు బురద చల్లుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నేషనల్ క్వాంటం మిషన్’ లక్ష్యాలకు అనుగుణంగా ఒక భారీ ‘క్వాంటం వ్యాలీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్టుకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, ఉన్నత సాంకేతిక సంస్థలు తమ కార్యక్రమాలను ఇక్కడికి అనుసంధానం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే NIELIT సంస్థ అమరావతిలో ఒక ప్రత్యేకమైన ‘డెడికేటెడ్ క్వాంటం అండ్ ఏఐ క్యాంపస్’ ను ఏర్పాటు చేస్తోంది.
ఇది అమరావతిలో కొత్తగా వస్తున్న టెక్నాలజీ హబ్ మాత్రమే కానీ, తిరుపతిలో ఉన్న కేంద్రాన్ని ఎత్తుకెళ్లి ఇక్కడ పెట్టడం కాదనే విజ్ఞతను వైసీపీ నేతలు కోల్పోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల అభివృద్ధిపై భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం, ప్రజాస్వామ్యంలో దానికి తావుంటుంది. కానీ, అసలు ఉనికిలోనే లేని అబద్ధాలను సృష్టించి, ఒక ప్రాంతం ప్రజలను మరో ప్రాంతం ప్రజలపైకి ఉసిగొలిపి రాజకీయం చేయాలని చూడటం అత్యంత దురదృష్టకరం అనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇలాంటి తప్పుడు కూతలు కూసే ముందు కనీసం అధికారిక వెబ్సైట్లలో ఉన్న వాస్తవాలను సరిచూసుకోవాలనే కనీస జ్ఞానం కూడా వైసీపీ ప్రజాప్రతినిధులకు లేకపోవడం సిగ్గుచేటు. కేవలం రాజకీయ ఉనికి కోసం రాష్ట్ర భవిష్యత్తుతో, ప్రాంతీయ సెంటిమెంట్లతో ఆడుకుంటున్న ఇలాంటి నాయకులకు ప్రజలే త్వరలోనే బుద్ధి చెబుతారని నెటిజన్ లు మండిపడుతున్నారు.






