మనం రోజువారీ జీవితంలో వాడుతున్న ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా 99 శాతం సముద్ర గర్భంలో పరిచిన వేల కిలోమీటర్ల పొడవైన ‘సబ్సీ కేబుల్స్’ ద్వారానే వస్తుంది. భారతదేశంలో ఇప్పటివరకు ఇలాంటి అంతర్జాతీయ డిజిటల్ గేట్వేలు కేవలం ముంబై, చెన్నై నగరాల వద్ద మాత్రమే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం.. దేశంలోనే 3వ అతిపెద్ద ‘డిజిటల్ ల్యాండింగ్ హబ్’గా అవతరించబోతోంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా ఏపీ తీరంలో నిర్మించబోతున్న ఈ మెగా ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు సాంకేతిక విశ్లేషణ ఏంటి..?
అసలు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే.. మైక్రోసాఫ్ట్ సంస్థ సైంట్టెల్, లైట్స్టార్మ్ కంపెనీలతో కలిసి ఏకంగా 3,600 కిలోమీటర్ల పొడవైన భారీ సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థను నిర్మిస్తోంది. దీనిని ‘ఇండియా-సౌత్ ఈస్ట్ ఏషియా’ కేబుల్ నెట్వర్క్ అంటారు. ఈ అంతర్జాతీయ డిజిటల్ హైవే ద్వారా మన విశాఖపట్నం నగరం.. నేరుగా సింగపూర్, ఆగ్నేయాసియాతో అత్యంత వేగవంతమైన కనెక్టివిటీని సాధిస్తుంది. సాధారణంగా ఇంటర్నెట్ డేటా వేరే నగరాల గుండా తిరిగి రావడానికి కొన్ని మిల్లీసెకన్ల సమయం పడుతుంది, దీనినే టెక్నికల్ భాషలో ‘లేటెన్సీ’ అంటారు.
కానీ ఈ డైరెక్ట్ కేబుల్ ల్యాండింగ్ వల్ల ఏపీలో ఇంటర్నెట్ స్పీడ్ విపరీతంగా పెరగడమే కాకుండా, డేటా ట్రాన్స్ఫర్ లో ఏమాత్రం ఆలస్యం ఉండదు. ఇది భవిష్యత్తు సాంకేతికతకు అత్యంత కీలకమైన పునాది. మరోవైపు, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కేవలం ఇంటర్నెట్ కేబుల్స్ వేయడంతోనే ఆగడం లేదు. విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ తన ప్రతిష్టాత్మక ‘కేబుల్ ల్యాండింగ్ స్టేషన్’తో పాటు ప్రపంచ స్థాయి ఏఐ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేస్తోంది. దీనితో పాటు దాదాపు 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ పనులను కూడా వేగవంతం చేశారు.
రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాలలో ప్రపంచాన్ని శాసించబోయే అతిపెద్ద డేటా ప్రాసెసింగ్ అంతా వైజాగ్ నుంచే సాగబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే, భవిష్యత్తులో గూగుల్, మైక్రోసాఫ్ట్ అందించే అత్యాధునిక ఏఐ సర్వీసులకు విశాఖపట్నం ఒక ప్రధాన నాడీ కేంద్రంగా మారబోతోంది. ఇప్పుడు మనకు వచ్చే అతిపెద్ద సందేహం.. ఈ కేబుల్స్ వల్ల సాధారణ ప్రజలకు, రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి..?
విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఎక్కడైతే సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ మరియు డేటా సెంటర్స్ ఉంటాయో, అక్కడికి అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడతాయి. ఎందుకంటే ఆ కంపెనీలకు కావాల్సిన హై-స్పీడ్ బ్యాండ్విడ్త్, అత్యంత తక్కువ లేటెన్సీ ఇంటర్నెట్ ఇక్కడే నేరుగా లభిస్తాయి. గతంలో ముంబై, చెన్నై నగరాలు ఐటీ మరియు బిజినెస్ హబ్లుగా ఎదగడానికి ఈ సముద్రగర్భ కేబుల్స్ కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే తరహా డిజిటల్ అడ్వాంటేజ్ వైజాగ్కు రాబోతోంది.
దీనివల్ల రాబోయే రోజుల్లో గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏపీలో తమ ఆఫీసులను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతాయి, తద్వారా స్థానిక యువతకు వేలాది హై-టెక్ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ భారీ డిజిటల్ గేట్వే ప్రాజెక్టుల మొదటి దశను 2028 మధ్య నాటికి పూర్తి చేయాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లోపు మైక్రోసాఫ్ట్ కేబుల్ నెట్వర్క్ కూడా అందుబాటులోకి రానుంది.
ఈ రెండు మెగా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో లైవ్లోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయం లేదా సాంప్రదాయ పరిశ్రమలకే పరిమితం కాకుండా, గ్లోబల్ డిజిటల్ మ్యాప్లో అత్యంత వ్యూహాత్మకమైన స్థానాన్ని సంపాదిస్తుంది. అంతర్జాతీయ వ్యాపారాలు, డిజిటల్ లావాదేవీలు మరియు టెక్నాలజీ ఇన్నోవేషన్స్కు ఏపీ ఒక కేరాఫ్ అడ్రస్గా మారుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లడంలో ఈ ‘డిజిటల్ ల్యాండింగ్ హబ్’ ఒక మైలురాయిగా నిలిచిపోబోతోంది.







