సోషల్ మీడియా దిగ్గజం మెటా టీనేజర్ల ఇంటర్నెట్ వినియోగంపై అత్యంత కఠినమైన నియామకాలను తీసుకురాబోతోంది. అమెరికాలో టీనేజ్ సోషల్ మీడియా అడిక్షన్ కు సంబంధించిన కేసులలో ఏకంగా 17 బిలియన్ డాలర్ల అంటే మన కరెన్సీలో సుమారు ₹1.4 లక్షల కోట్ల.. భారీ మొత్తాన్ని చెల్లించి రాజీ పడేందుకు సిద్ధమైన మెటా, భవిష్యత్తులో ఇలాంటి నష్టాలను నివారించేందుకు మరియు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఈ కీలక నిర్ణయాలను ప్రకటించింది.
ఈ సరికొత్త నిబంధనల ప్రకారం.. అమెరికాలో 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న యూజర్లకు రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, టీనేజర్లలో డిప్రెషన్, మానసిక ఒత్తిడికి కారణమవుతున్న ‘లైక్ల పోటీ’కి చెక్ పెట్టేందుకు ఇకపై లైక్ల కౌంట్ ను పూర్తిగా తొలగించనున్నారు. అలాగే, పిల్లలు అర్ధరాత్రి వేళల్లో నిద్రపోకుండా సోషల్ మీడియా వాడకుండా ఉండేలా.. అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు యాప్లు పూర్తిగా బ్లాక్ కానున్నాయి.
సోషల్ మీడియాలో పిల్లలు తమ వయస్సును తప్పుగా నమోదు చేసి లాగిన్ అవ్వకుండా అడ్డుకట్ట వేసేందుకు మెటా సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. వినియోగదారుల అసలు వయస్సును ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అమెరికాలో ప్రయోగాత్మకంగా మొదలవుతున్న ఈ నిబంధనలు రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.







