విజయవాడ నగర వాసులకు, ముఖ్యంగా ఎన్హెచ్-16పై ప్రయాణించే వాహనదారులకు సుదీర్ఘకాలంగా నరకం చూపిస్తున్న ట్రాఫిక్ కష్టాల నుంచి ఎట్టకేలకు ఒక స్పష్టమైన పరిష్కారం లభించబోతోంది. రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగు వేశాయి. గతంలో మెట్రో రైల్ అలైన్మెంట్తో కలిపి సుమారు రూ. 1,000 కోట్ల భారీ అంచనాతో ప్రతిపాదించిన ‘డబుల్ డెక్కర్’ మోడల్ వల్ల భూసేకరణ, వ్యయం భారీగా పెరుగుతుండటంతో.. ఇప్పుడు ఆ డిజైన్ను మార్చారు.
బడ్జెట్ను ఏకంగా రూ. 400 కోట్లకు కుదించి, పక్కాగా నాలుగు వరుసల రహదారి ఫ్లైఓవర్గా దీనిని నిర్మించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సరికొత్త నాలుగు వరుసల ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెజవాడలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన రామవరప్పాడు రింగ్, ప్రసాదంపాడు, ఏనికేపాడు, మరియు నిడమానూరు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు 70 శాతానికి పైగా తగ్గిపోనున్నాయి. ప్రస్తుతం బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత వాహనాలన్నీ మహానాడు, రామవరప్పాడు రింగ్ వద్దే నిలిచిపోతుండటంతో పీక్ అవర్స్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ రూ. 400 కోట్ల ఫోర్-లేన్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే స్థానిక వాహనాలన్నీ సిగ్నల్ ఫ్రీగా సాఫీగా సాగిపోతాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కూడా ఈ ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించేలా ఢిల్లీ స్థాయిలో ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. ఈ ఫ్లైఓవర్ బడ్జెట్ను రూ. 400 కోట్లకు తగ్గించడానికి జాతీయ రహదారుల సంస్థ తీసుకున్న నిర్ణయం వెనుక విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాజెక్ట్ కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ సరికొత్త వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వస్తే..
చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై వెళ్లే అంతరాష్ట్ర భారీ లారీలు, ఇతర భారీ వాహనాలన్నీ నగరంలోకి రాకుండా పూర్తిగా వెలుపలి నుంచే డైవర్ట్ అయిపోతాయి. దీనివల్ల ఎన్హెచ్-16 పై ఒత్తిడి సహజంగానే తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే, భారీ వాహనాలు బైపాస్ వైపు వెళ్లాక, నగర అంతర్గత ట్రాఫిక్ అవసరాల కోసం రూ. 400 కోట్లతో నిర్మించే నాలుగు వరుసల ఫ్లైఓవర్ అటు ప్రజాధనాన్ని ఆదా చేస్తూనే, ఇటు బెజవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా తీర్చబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.














