ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైళ్ల క్లియరెన్స్ మరియు పరిపాలనా వేగంపై కీలక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లను మంత్రులు, కార్యదర్శులు, మరియు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు త్వరితగతిన క్లియర్ చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సంబంధించిన పనులు కార్యాలయాల్లో నత్తనడకన సాగడంపై సీఎం అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అదే సమయంలో, నిర్దేశిత రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే ఫైళ్లను పరిష్కరించిన అధికారులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు కొందరు కీలక అధికారులు హాజరుకాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను చర్చించే ఇలాంటి అత్యున్నత స్థాయి సమావేశాలకు గైర్హాజరు కావడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. సమావేశానికి రాని అధికారులందరి నుంచి తక్షణమే లిఖితపూర్వక వివరణ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ను సీఎం ఆదేశించారు.
పరిపాలనలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంచేందుకు మరియు అవినీతిని అరికట్టేందుకు గాను, ఇకపై ఫైళ్ల నిర్వహణ అంతా పూర్తిగా ‘ఆన్లైన్’ ద్వారానే జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాత పద్ధతిలో ‘మాన్యువల్’ ఫైళ్లను నిర్వహించడాన్ని ఇకపై తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించారు. అన్ని శాఖల్లో వంద శాతం ఆన్లైన్ ఫైలింగ్ విధానం అమలుపై నిశితంగా పరిశీలించి, నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.









