ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు గంటల తరబడి వేచి ఉండే ఇబ్బందులు తప్పించడమే కాకుండా, సూదుల భయం లేకుండా చేసేందుకు ఏపీ సర్కార్ సరికొత్త డిజిటల్ టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానంలో.. రోగి శరీరం నుంచి ఎలాంటి రక్తాన్ని సేకరించకుండానే కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఏకంగా 60 రకాల కీలక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఈ ఆధునిక సాంకేతికత ద్వారా కేవలం 60 సెకన్ల వ్యవధిలోనే రోగి యొక్క పూర్తి బాడీ ప్రొఫైల్ తాలూకు లోపాలను గుర్తించి, తక్షణమే కంప్యూటరైజ్డ్ డిజిటల్ హెల్త్ రిపోర్టులను సిద్ధం చేస్తున్నారు.
సాధారణంగా ల్యాబ్ టెస్టుల రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురుచూసే అవసరం లేకుండా, క్షణాల్లోనే రోగ నిర్ధారణ చేసి అత్యవసర వైద్యం అందించడానికి ఈ సిస్టమ్ ఎంతో దోహదపడనుంది. మంగళగిరిలో జరుగుతున్న ఈ ట్రయల్ రన్ గనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పెద్దాసుపత్రులకు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ ఫేస్ స్కానింగ్ మిషన్లను విస్తరించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న ఈ సరికొత్త విధానం అందుబాటులోకి వస్తే.. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండానే సామాన్యులకు సైతం పైసా ఖర్చు లేకుండా తక్షణ హైటెక్ వైద్య సేవలు అందుతాయి.












