అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత నమ్మకమైన మిత్రదేశాలుగా పేరుగాంచిన సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు ఒక్కసారిగా బీటలు వారాయి. ముస్లింల పవిత్ర నగరం మక్కాపై యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు వైమానిక దాడి ముప్పు తెచ్చిపెట్టిన వేళ, సౌదీకి సైనిక మద్దతు ఇవ్వకుండా పాకిస్తాన్ వెనకడుగు వేసింది. గత నెలలోనే సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ దేశాలు కలిసి ఒకరిపై దాడి జరిగితే అందరిపై జరిగినట్లేనని ‘మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం’ పై సంతకాలు చేశాయి.
అయితే, ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి పరీక్షలోనే పాకిస్తాన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం సౌదీకి వెన్నుపోటు పొడిచిందనే చర్చ అంతర్జాతీయ వేదికలపై నడుస్తోంది. మక్కా నగరంపై డ్రోన్ దాడి జరిగిందన్న వార్తలను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కేవలం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించి చేతులు దులిపేసుకున్నారు. పాక్ దళాలను యెమెన్లోని హౌతీ స్థావరాలపై దాడులకు పంపే ప్రసక్తే లేదని, ప్రస్తుతానికి అదంతా కేవలం ఒక ఊహాజనిత విషయమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ దాటవేసింది.
పాకిస్తాన్ ఇలా మొహం చాటేయడానికి ప్రధాన కారణం తన సొంత ఆర్థిక ప్రయోజనాలే. ఎర్రసముద్రం, హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే చమురు, గ్యాస్ రవాణాపై పాక్ ఆధారపడి ఉంది. హౌతీలను టార్గెట్ చేస్తే, వారికి మద్దతు ఇస్తున్న ఇరాన్ ఎక్కడ తమ గ్యాస్ సరఫరాను అడ్డుకుంటుందోననే భయంతో పాకిస్తాన్ ఈ దగాకు ఒడిగట్టింది. సౌదీ అరేబియా కష్టకాలంలో పాకిస్తాన్ ఇలా సాయం చేయకుండా దాగుడుమూతలు ఆడటంతో రియాద్ తీవ్ర అసహనానికి గురైంది.
పాకిస్తాన్ను నమ్ముకుంటే లాభం లేదని గ్రహించిన సౌదీ అరేబియా.. హౌతీల సైనిక మోహరింపులు, భవిష్యత్ దాడుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో ఏకంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సాయాన్ని కోరింది. ఇజ్రాయెల్తో సౌదీకి ఎలాంటి అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, మక్కా భద్రత కోసం రియాద్ ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ముస్లిం దేశాల రక్షణ కూటమి అని గొప్పలు చెప్పుకున్న పాకిస్తాన్, తీరా సమయం వచ్చేసరికి మక్కా పవిత్రతను కాపాడటంలో వెనకడుగు వేయడం ఇప్పుడు అరబ్ దేశాల్లో హాట్ టాపిక్గా మారింది.














