అమరావతిలో జరిగిన ‘8వ జిల్లా కలెక్టర్ల సదస్సు’ ముగింపు సందర్భంగా ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టేందుకు, నదుల అనుసంధానం, జల వనరుల సంరక్షణలో విశేష కృషి చేస్తూ ‘వాటర్ మ్యాన్’గా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు, మంత్రులు లేచి నిలబడి చప్పట్లతో ‘స్టాండింగ్ ఓవేషన్’ ఇచ్చి ఘనంగా గౌరవించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేవలం ఆలోచనలు ఉంటే సరిపోదని, వాటికి తగ్గట్లుగా పక్కా అమలు కూడా ఉండాలని స్పష్టం చేశారు. “వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్” అనే నినాదంతో ముందుకు సాగి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు నీళ్లిచ్చి, అక్కడి రైతులను ఆదుకున్నప్పుడే తనకు నిజమైన సంతృప్తి కలుగుతుందని సీఎం భావోద్వేగంగా పేర్కొన్నారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు 25, అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 నుండి 15 వరకు అత్యంత ప్రాధాన్యతాంశాలను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయి నుండి వచ్చే నివేదికలు ప్రభుత్వాన్ని మభ్యపెట్టే విధంగా కాకుండా, పక్కా వాస్తవాలతో కూడిన నివేదికలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. అభివృద్ధి సాధించడంలో కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మంత్రుల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉండాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను వేగంగా సాధించగలమని ఈ సదస్సు వేదికగా చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.














