ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల విస్తరణకు మరియు రవాణా కనెక్టివిటీకి కేంద్ర కేబినెట్ భారీ ఊతాన్ని అందించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల మధ్య అత్యంత కీలకమైన రేణిగుంట-అరక్కోణం సెక్షన్లో 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే తిరుపతి, చిత్తూరు జిల్లాలను కవర్ చేస్తూ సుమారు 46 కిలోమీటర్ల మేర సాగే ఈ రైల్వే ప్రాజెక్టును రూ. 1,157 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్నారు.
ఈ రెండు అదనపు రైల్వే లైన్ల నిర్మాణం వల్ల తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు రైలు ప్రయాణ సౌకర్యాలు మరియు కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడనున్నాయి. ఈ మార్గంలో రైళ్ల రద్దీ తగ్గడంతో పాటు రైళ్లు సరైన సమయానికి నడవడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణా సామర్థ్యం పెరిగి, పరిశ్రమల లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి ఏపీ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఏపీ రైల్వే మౌలిక వసతుల విస్తరణకు ఇంతటి భారీ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు గానూ ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.














