తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ముఠాపోరు మరోసారి బహిరంగంగా బట్టబయలైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) వర్ధంతి వేడుకల సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గాంధీ భవన్ వర్గాలతో పాటు సీఎం క్యాంపులో భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయనతో పాటు వచ్చిన వలస నేతలను టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డికి ఇప్పటికీ లక్షలాది మంది అభిమానులు ఉన్నారని, తాను వైఎస్సార్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. “ఎవరెన్ని కుట్రలు చేసినా మేము వైఎస్సార్ శిష్యులం, ఆయన్ని ఎప్పటికీ మరవం.. వైఎస్సార్ ఆశయాల కోసమే నిరంతరం పాటుపడతాం” అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవిపై తనకున్న ఆకాంక్షను ఆయన ఓపెన్గానే బయటపెట్టారు. “అందరూ సీఎం.. సీఎం అంటున్నారు.. దానికి ఒక టైం రావాలి, ఆ టైం వస్తే నేను సీఎం అవ్వడాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు” అంటూ రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇక కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి అత్యంత పదునైన విమర్శలు గుప్పించారు. “కొత్తవాళ్లు పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ను కబ్జా చేయాలని చూస్తే ఈ రాజగోపాల్ రెడ్డి చూస్తూ ఊరుకోడు” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వనని, వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, పేదల సంక్షేమమే ధ్యేయంగా సాగిన ‘వైఎస్సార్ రాజ్యం’ మళ్లీ తెస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం పార్టీలో సరికొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు ఢిల్లీలో కొండా సురేఖ వ్యవహారంతో హైటెన్షన్ నడుస్తుంటే, మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఇలా ‘సీఎం’ కుర్చీని ఉద్దేశించి, వలస నేతలపై తిరుగుబావుటా ఎగురవేయడం తెలంగాణ కాంగ్రెస్లో రాజుకుంటున్న అసంతృప్తికి అద్దం పడుతోంది.







