31 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతిలీడర్ అవ్వాలంటే అమరావతిని ఎత్తుకోవాల్సిందేనా ?

లీడర్ అవ్వాలంటే అమరావతిని ఎత్తుకోవాల్సిందేనా ?

చైనాలో బ్లాక్ వెదురు విత్తనం మొలకెత్తడానికి ఐదేళ్లు పడుతుంది. విత్తనం వేసిన నాటి నుంచే భూమి లోపల పని మొదలవుతుంది. నేల సారాన్ని పరీక్షించి తేల్చుకొని, పోషకాల్ని, నీటి నిల్వల్ని అన్వేషించి క్రమంగా పోగు చేసుకుంటుంది ఆ విత్తనం. ప్రతీ కణంలోనూ నీటి అణువులతోపాటు పోషకాల్ని దాచుకుంటుంది. నేల లోపలి నుంచి పొరల్ని చీల్చుకుంటూ మొలకై పైకి రావడానికి దాదాపు ఐదేళ్ల సమయం పడుతుంది. మొలకెత్తిన కొద్ది వారాల్లోనే ఈ ఐదేళ్ల శ్రమ అక్కరకొస్తుంది. ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తుకు ఎదుగుతుంది. ఈ వెదురే కాదు ఇలాంటి ఎదురులేని కథలు, గాధలూ కొన్ని మన కళ్ల ముందు కూడా కదులుతుంటాయ్. అమరావతి అలాంటిదే ! రెండేళ్ల నాడు మొదలైనప్పుడు ఈ ఆందోళన తీవ్రత అర్థం కాలేదు చాలా మందికి. రాజకీయాన్నీ, ఓ జాతి భవిష్యత్ నూ అమరావతి ఎంతగా శాసిస్తుందో తెలియడానికి మరో రెండేళ్లు కూడా పట్టకపోవచ్చు. పాదయాత్రను చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది.

అది ఓ ప్రాంతం ఆందోళన. రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గిపోయాయని ఓ వర్గం నడిపిస్తున్న ఉద్యమం అని ముద్ర కొట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అమరావతి అంటే భవిష్యత్తు, అమరావతి అంటే ఓ జాతి ప్రతిష్ట… అమరావతి అంటే ఆంధ్ర ప్రదేశ్ తరాలు ఎలా ఉంటాయో, ఉండాలో చూపించే దిక్సూచి అని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది అందరికీ ! నడిచొస్తున్న రాజధాని రైతులకు స్వాగత సత్కారాలు, సపోర్టులు ఎదురొస్తున్నది ఇందుకోసమే. అమరావతి పోరాటంలో ప్రాంతాల్లేవు. వర్గాల్లేవు. కులాలు అంతకన్నా లేవు. ఆరు కోట్ల మంది ఆంధ్రుల కోసం ఓ 30 వేల మంది చేస్తున్న తపస్సు అమరావతి. వాళ్ల ఆరాటం భూమి కోసం భుక్తి కోసం కాదు. నేల మీద పడిన వెదురు విత్తు మొలకెత్తడం కోసం. అభివృద్ధి భవిష్యత్తు అక్కడ మొక్కలై మొలిచి, వృక్షాలై నిలిచి రాబోయే తరాలు రాజిల్లేందుకు వేదిక ఇది అని నిరూపించేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు వాళ్లు సిద్ధపడ్డారు. అందుకే తిరుమల వాళ్లకి పెద్ద దూరం అనిపించలేదు. పైగా భగవంతుడి ఆశీస్సులకంటే ముందే జన నీరాజనం అందుతోంది వాళ్లకి. రెండేళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రుల మైండ్ సెట్ ఎలా మారిందో ఎంత ఆలోచిస్తుందో చెప్పేందుకు ఇది ఓ మచ్చుతునక. చైనా వెదురులాగే అమరావతి ఉద్యమం కూడా పరిస్థితుల్ని పరిణామాల్ని ఆకళింపు చేసుకుంది ఇప్పటికే. ఇక ఆకాశాన్ని తాకే ఉవ్వెత్తు ఉత్సాహంతో ఎగసిపడే
రోజులే ముందన్నీ !

ఏ పోరాటంలో అయినా ఓ తరం త్యాగాలు చేస్తుంది. కష్టనష్టాలకు ఓర్చుకుంటుంది. ముళ్లపై చేతులు మోపి, దారి చేసి… భవిష్యత్ తరాలను నడిపించేందుకు సిద్ధపడుతుంది. అమరావతి రైతులు చేసింది, చేస్తున్నదీ అదే. యాత్రకు సిద్ధపడాలి అనుకున్నప్పుడు చేతిలో పైసా లేదు. అప్పటికే ఖర్చులు చాలా అయ్యాయ్. రెండేళ్లుగా నిరసన కొనసాగించడం అంటే నీరసంతో పాటు డబ్బులకి కటకట కూడా ఉంటుంది. అన్నిటినీ దిగమింగి వాళ్లు నడక మొదలు పెట్టారు. ఇప్పుడు ఇక మేము సైతం అంటూ జనం ముందుకు వస్తున్నారు. ఒక్కరే ఉంటే నేను, కొందరు అయితే మనం. అదే మనం కాస్తా జనంగా మారితే అదే ప్రభంజనం అవుతుంది అని పర్చూరు, అద్దంకి రాగానే అర్థం అయిపోతోంది. మేం మీకు సాయపడతాం, అండగా ఉంటాం అంటూ వేల మందిగా వస్తున్న జనమే కాదు… లక్షల్లో అందిస్తున్న సాయం అమరావతి పోరాటానికి కొత్త ఊపిరులు ఊదుతోంది. వాళ్లు ఇస్తున్నది డబ్బు మాత్రమే కాదు రాజధానికి అండదండలు. ఒక్క అద్దంకిలోనే 40 లక్షలకిపైగా సొమ్ము ఇవ్వడంతోపాటు ఇక మేమూ మీతోనే అనడం చూస్తే అమరావతిని చేతులు చాచి పిలిచి ఈ రాష్ట్రం హత్తుకుంటోంది అని అర్థం అవుతోంది.

ఓ కొత్త ప్రయాణం మొదలైనప్పుడు ఆటు పోట్లు చాలానే ఉంటాయ్. ఛీత్కారాలూ, చమత్కారాలూ ఎదురు దెబ్బలే సన్మానాలు అవుతాయ్. డొక్కల్లో తన్నిన తన్నుల్ని ఆ తల్లులు తట్టుకొని నిలబడ్డప్పుడే అమరావతి నిలబడటం ఖాయం అయ్యింది. అమరావతి యాత్రలో కదం కలిపిన రేపటి తరం ఆడబిడ్డల్ని అవహేళనగా మాట్లాడుతున్న వాళ్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటుంది… వీళ్లు రైతులా అని అడగడం అధికారం అనే కళ్లద్దాల్లోంచి చూస్తున్నప్పుడు కామెడీగా అనిపిస్తోందేమో ! అవును. వాళ్లు రైతులే… నాగలితో అరక దున్నే రోజుల నుంచి గ్రీన్, ఫాలీ హౌసులు పెట్టి హార్టీ కల్చర్ చేేసే రోజుల్లోకికి సాగు వచ్చేసినట్టే, రైతులు కూడా ఆధునిక హంగులు అందిపుచ్చుకున్నార్రా – అని యావత్ ఆంధ్ర ప్రదేశ్ అమరావతికి అనుకూలంగా తీర్పు చెప్పే రోజు ఇంకెంతో దూరం లేకపోవచ్చు. పైపెచ్చు, అప్పటికి మూడు ముచ్చట తిరగబెట్టి మాడు పగిలే సమాధానం ఆ రెండు ప్రాంతాల నుంచి కూడా రావడం ఖాయం అవుతుంది. నదిని ఆక్రమించామనో, ప్రవాహానికి అడ్డుకట్ట వేశామనో స్వార్థపరులు మొదట సంబరపడొచ్చు గాక, వరద ముంచెత్తినప్పుడు తెలుస్తుంది ప్రకృతి తీర్పు అంటే ఏంటో ! నది ఒడ్డున పుట్టిన అమరావతి కూడా అలాంటిదే. అడ్డంకులు అణిచివేతలూ తాత్కాలిక మజిలీలే. రేపటి గెలుపే సిసలైన గమ్యం.

అందుకే ఇప్పుడు అమరావతి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఓ సందేశం ఇస్తోంది. పోరాటం ఎలా చేయాలో, అణిచివేతల్ని, దెబ్బ తీసే ఎత్తుగడల్ని, నమ్మించి మోసం చేసే కుట్రల్ని ఎలా తిప్పికొట్టాలో చూపిస్తోంది. భూమి నమ్మిన రైతులు తిరగబడుతున్న తీరు ఏపీ చరిత్ర గతిని తిరగరాయబోతోంది. మాతో కలిసి నడిచినవాళ్లు భవిష్యత్ నిర్మాతలు, మాకు సాయపడిన వాళ్లు దీర్ఘదర్శులు, మాకు అండదండలు అందించిన వాళ్లే జాతి మెచ్చే నాయకులు అని అమరావతి పోరాట యోధులు నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీళ్ల పక్షాన నిలబడిన ప్రతీ ఒక్కరూ గెలిచే సైడు ఉన్నట్టే ! గెలుపులో భాగం అయినట్టే ! ఆంధ్రా భవిష్యత్తును ఆకాంక్షించే ప్రతి గుండె తలుపునూ తట్టినట్టే ! అందుకే అమరావతికి గొంతుకు అయినవాడు రేపటి రోజున నాయకుడుగా నిలబడతాడు. కాగడాలా వెలుగుదారి చూపుతాడు. అమరావతి యోధులు ఇప్పటికి దాటింది ఒక్క జిల్లానే ! మరి రేపటి రోజున జిల్లాలు దాటుకుంటూ సీమ సాయం కోరుతూ, వెంకన్న ఆశీస్సులు అందుకున్న రోజున కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆధునిక ఆంధ్రుల కీర్తి కిరీటంలో అమరావతి జెండా రెపరెపలు రాష్ట్రానికి కాదు దేశానికే కొత్త పాఠం అవుతాయ్. కొందరికి గుణపాఠం నేర్పుతాయ్.

RELATED ARTICLES

1 COMMENT

  1. జలగాసుర ముఠా కుట్రల దెబ్బకి, అరలక్ష మంది అసలు పోలీసుల ఉద్యోగాలు హుష్, వేలాది నకిలీ పోలీసులకి పర్మినెంట్ ఉద్యోగాలు..

    ముందుగా ఒక జీఓ ఇస్తారు ..
    10-20 ఏళ్ళ సర్వీసు దాటిన పోలీసులని, మిలిటరీ సర్వీసు లెక్కన వాలంటరీ రాజీనామా ఇప్పించి , పనితీరు ఆదారముగా మరికొంతమందిని తొలగిస్తారు ..

    కొత్తగా వాలంటీరు ఇంటర్వ్యూ తరహాలో , కావలసిన ఫ్యాక్షన్ రౌడీలకి పోలీసు ఉద్యోగాలు అంటారు ..

    ఇప్పుడు జలగాసుర ముఠా పంపే నకిలీ పోలీసులు చేసే దాడులు , కుట్రలు నిజాయితీ పోలీసులు అడ్డుకోవట్లేదు, భయముతో సామాన్య ప్రజలు నిలదియ్యట్లేదు ..

    అసలు ఎంతమంది నిజమైన పోలీసులు – ధర్నాలు ,ర్యాలీల నియంత్రణ విధుల్లో ఉన్నారో ఎవరికీ తెలవదు ..

    వందలాది జలగాసుర ముఠా తమ ఫ్యాక్షన్ రౌడీలని ,నకిలీ పోలీసుల వేషములో – విపక్ష కార్యకర్తలని , భూములు త్యాగం చేసిన రైతులని కొట్టటానికి పంపిస్తున్నారు .

    ఈ నకిలీ పోలీసులు /రౌడీలు ఎవరు ఎంత గట్టిగా కొడితే ,వాళ్ళకే పోలీసు ఉద్యోగాలు పర్మనెంట్ అన్న హామీ కొంతమంది హైలీ రెస్పెక్టేడ్ సలహా రెడ్లు ఇచ్చారు ..

    దీనికి ముందస్తు ట్రయల్‌గా, కొంతమంది వాలంటీరు గ్రామా మహిళలకి పోలీసు డ్రస్సులు ఇచ్చినట్లున్నారు ..

    ఇప్పుడు కాకపోతే, తరువాత ఎన్నికలలో అయినా కొద్దిమంది పోలీసులు-అధికారులని కోట్ల లంచాలతో భయపెట్టి లోబరుచుకొని, ముందు గెలిచి ,
    ఆ తరువాత కోట్లు లంచాలు తీసుకున్న వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి ,వడ్డీలతో సహా వెనక్కి లాక్కొని , ఉద్యోగాలలోంచి పీకిపడేస్తారు ..

    తరువాత ఈ ప్యాక్షన్ నకిలీ రౌడీ పోలీసులకి ఉద్యోగాలు ..

    ఈ నకిలీ పోలీసుల అండతో , చివరికి రాష్ట్రం మొత్తం అంటే-
    4 కోట్ల ఎకరాలు -పొలాలూ , స్థలాలు , ఇళ్ళు , పరిశ్రమలు , అడవులు, ఘనులు, నదులతో సహా మొత్తం మహామేత కుటుంబం పేరుమీద రాసుకుంటేనే కానీ వాళ్ళ ధనదాహం తీరదు ..

    రాష్ట్రం మొత్తం 4కోట్ల ఎకరాలు, ఒక్క జీవోతో , జలగాయ పేరు మీద రాసుకున్న తరువాత, ఇక 30 ఏళ్ళు ఎదురేముంది ..

    ఈ లోపల మాట్లాడే వాళ్ళని, కేసులతో భయపెట్టి, జైలులో పడేస్తున్నారు ..

    భూములు త్యాగం చేసిన రైతులకి అన్యాయం చేసేలా మూడు ముక్కలు అనగానే కరోనా వచ్చింది ..

    ఇప్పుడు దేవస్థానం యాత్రలో భూములు త్యాగం చేసిన రైతులని నకిలీ పోలీసులు కొట్టగానే ,ఆ శ్రీవారు ప్రకృతి రూపములో ఆగ్రహాన్ని చూపించి కనుమ దారులు మూసేయించారు ..

    ఏకైక ప్రజారాజధానికి శ్రీవారే రక్ష ..

    ఉద్యోగులు -పోలీసులు ధర్మాన్ని,న్యాయాన్ని రక్షిస్తేనే ,
    తమని తాము కాపాడుకోగలరు ,
    శాండ్-ల్యాండ్- మైన్స్- వైన్స్ -లిక్కర్-డ్రగ్స్ జేట్యాక్సు జలగాసుర మాఫియా నుంచి రాష్ట్రం -రాజధాని-పరిశ్రమలు -ఉపాధి -ఉద్యోగాలు- ఆస్తులు – యువత భవిష్యత్తుని రక్షించుకోగలరు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments