తెలంగాణ కాంగ్రెస్లో గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకపాన్పు ఎక్కారంటూ సాగిన ప్రచారానికి తెరపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకేలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేస్తూ రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా ప్లేట్ తిప్పేశారు. మునుగోడు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని చెప్తూ, సీఎం రేవంత్ నాయకత్వంపై ఆయన పూర్తి నమ్మకాన్ని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో వివక్ష జరుగుతోందన్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ రాజగోపాల్ రెడ్డి కీలక గణాంకాలను బయటపెట్టారు. “సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిర ఏ స్థాయిలో నిధులతో దూసుకుపోతున్నాయో.. నా మునుగోడుకు కూడా అదే రేంజ్లో నిధులు ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ. 2,000 కోట్ల భారీ నిధులు మునుగోడుకు మంజూరయ్యాయి” అని ఆయన వెల్లడించారు. త్వరలోనే మునుగోడులో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి అధికారిక సభను వేలాది మంది కార్యకర్తలతో కలిసి జయప్రదం చేస్తానని ప్రకటించారు.
ముఖ్యమంత్రితో ఉన్న సంబంధాలపై వస్తున్న వార్తలను రాజగోపాల్ రెడ్డి తోసిపుచ్చారు. “నేను సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడూ దూషించలేదు. ఒకటి రెండు పాలనాపరమైన అంశాల్లో మాత్రమే కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి తప్ప మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు” అని క్లారిటీ ఇచ్చారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై స్పందిస్తూ.. క్యాబినెట్లో ఎవరికి చోటు ఇవ్వాలనేది పూర్తిగా కాంగ్రెస్ అధిష్ఠానానికే వదిలేశానని, హైకమాండ్ ఫైనల్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.







