ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్తలు వినిపించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఉద్యోగ శ్రేణులను బాధ్యతాయుతంగా కలుపుకుపోవాలనే ఉద్దేశంతో పలు కీలక డిమాండ్ల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని సీఎం స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. సభ ముఖంగా చేసిన ఈ వరాల జల్లుతో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశాయి.
ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డియర్నెస్ అలవెన్స్ లపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. బాకీ ఉన్న 2 డీఏలను ఈ ఏడాది అక్టోబరు నెల జీతాల నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. దీంతో పాటు నిలిచిపోయిన 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘సరెండర్ లీవ్’ బకాయిల నగదును రాబోయే సంక్రాంతి పండుగ నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల సవరణకు సంబంధించి 12వ పీఆర్సీ (PRC) నియామకానికి కూటమి ప్రభుత్వం అధికారికంగా అంగీకారం తెలిపిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక విశ్రాంత ఉద్యోగులకు (పెన్షనర్లు) కూడా పెద్ద ఊరట కల్పిస్తూ.. వారి ‘అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్’ ను 10 శాతం నుండి 15 శాతానికి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.







