పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ, అపరిశుభ్రం చేసేవాళ్ల మీద జరిమానాలు విధిస్తామని ప్రకటించింది. ప్రకటించిన వెంటనే నిర్ణయం అమల్లోకి వచ్చింది. రోడ్డు మీద ఉమ్మి వేసేవాళ్లకు 100 రూపాయలు రోడ్డు మీద చెత్త వేసేవాళ్లకు 200 రూపాయలు జరిమానా విధిస్తారు. ప్రజలకు నొప్పి తగలందే దారికి రారు. మన ప్రభుత్వాలు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అని కార్యక్రమాలు చేపడతుంటాయి. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రధానమంత్రి దగ్గరనుంచి ముఖ్యమంత్రి వరకు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ ప్రజలు పాటించరు.
రోడ్ల మీద చెత్త వేసేవాళ్లు, కాలువల్లో వేసేవాళ్లు మన కళ్లముందే వుంటారు. హైదరాబాద్ లో మూసి నది పరిసరాలు, అలాగే నాలాల్లో చెత్త వేస్తుంటారు. కోళ్ల వ్యర్ధాలు, జంతుమాంస వ్యర్ధాల దగ్గర్నుంచి అన్నీ వేస్తారు. విజయవాడలో క్రిష్ణా నది కనకదుర్గ వారధి మీద, ప్రకాశం బ్యారేజి మీద నుంచి చెత్త బస్తాలు, కోళ్ల వ్యర్ధాల బస్తాలు నదిలోకి విసరడం. ఏలూరు కాలువ, బందరు కాలవల పరిస్థితి కూడా ఇంతే. గట్ల మీద గుడిసెలు వేసుకుని వ్యర్ధాలన్నీ కాలువల్లోకి వదులుతారు. దిగువ ప్రాంతాల ప్రజలకు అదే తాగునీరు అనే స్ప్రుహ వుండదు. ప్రభుత్వాలు పట్టించుకోవు.
పరిసరాల పరిశుభ్రతతో సగం రోగాలు నివారించవచ్చు. కఠినమైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు దారికి రారు. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేని వాళ్ల మీద, రాంగ్ సైడ్ నడిపేవాళ్లమీద, రోడ్ల మీద పార్కింగ్ చేసేవాళ్ల మీద, అతి వేగంగా నడిపేవాళ్ల మీద భారీ జరిమానాలు విధిస్తున్నారు. వాళ్లు అక్కడికక్కడ రోడ్డు మీద అడ్డుకోరు. సింపుల్ గా ఫోటో తీసి, జరిమానా ఇంటికి పంపుతారు. దీని వల్ల 50 శాతం మార్పు వచ్చింది. అదే విజయవాడలో రోడ్డు నడిపేవాడి అడ్డా అన్నట్టుగా నడుపుతారు. పోలీసులు కూడా ప్రేక్షకుల్లాగా చూస్తుంటారు.
భరత్అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి మహేష్ బాబు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాళ్ల మీద వేల రూపాయలు జరిమానాలు విధించినట్టుగా ఇక్కడ కూడా చేస్తే కానీ దారికి రారు. మనకి సివిక్ సెన్స్ తక్కువ కాబట్టి కఠిన చర్యలతోనే దారికొస్తారు. ట్రాఫిక్ తో పాటు పారిశుద్ధ్యం విషయంలో కూడా కఠినచర్యలు తీసుకోవాలి. ఇదే జనం అమెరికా వెళ్తే తినుబండారాల వ్యర్ధాలు, వాటర్ బాటిళ్లు బయటకు విసిరెయ్యరు. కార్లో భద్రంగా పెట్టుకుని ఇంటికెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు. కారణం జరిమానాల భయం. ఆ భయం వుంటేనే డిసిప్లిన్ అలవాటవుతుంది. లివింగ్ కండిషన్స్ పెరిగేది అప్పుడే. బెంగాల్లో బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఫాలో అయితే రోడ్లు, నీటి వనరులు శుభ్రంగా వుంటాయి.







