రాబోయే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మేయర్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండటంతో అధికార తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం అంతర్గత పోటీ తీవ్రతరమైంది. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక రేసులో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వారసుడు బొండా సిద్ధార్థ్ పేరు బలంగా వినిపిస్తుండగా, మరో సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణ గ్రాఫ్ స్థానిక సమీకరణాల వల్ల కొంత తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బొండా సిద్ధార్థ్ అభ్యర్థిత్వానికి క్షేత్రస్థాయిలో సానుకూలత రావడానికి ప్రధాన కారణం ఆయన కుటుంబానికి ఉన్న పొలిటికల్ ట్రాక్ రికార్డ్. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ తీవ్రమైన కష్టకాలాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బొండా ఉమ కుటుంబంపై అనేక కేసులు, రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, సిద్ధార్థ్ ఎక్కడా లొంగకుండా పార్టీ లైన్ లోనే నిలబడ్డారు. ఎలాంటి ప్రలోభాలు వచ్చినా జెండా మార్చకుండా, స్థానిక క్యాడర్కు ధైర్యాన్ని ఇస్తూ పార్టీని నడిపించడంలో కీలక పాత్ర పోషించారనే టాక్ సిద్ధార్థ్ వర్గంలో బలంగా ఉంది.
ఈ నిలకడైన రాజకీయ వైఖరే చంద్రబాబు నాయుడి వద్ద సిద్ధార్థ్కు పెద్ద ప్లస్ పాయింట్గా మారిందని ఆయన వర్గం చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బెజవాడలో సొంత ఇమేజ్ ఉన్న వంగవీటి రాధాకృష్ణకు ప్రస్తుత మున్సిపల్ సమీకరణాలు కొంత ప్రతికూలంగా మారాయి. దానికి గల ముఖ్యమైన కారణాలు.. రాధాకృష్ణ కేవలం సార్వత్రిక ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్గా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం మినహా, నిరంతరం విజయవాడ లోకల్ క్యాడర్తో టచ్లో లేరనే అసంతృప్తి స్థానిక తమ్ముళ్లలో ఉంది.
టీడీపీకి మరియు అధినాయకత్వానికి తీవ్ర నష్టం చేకూర్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలతో రాధాకృష్ణకు ఉన్న వ్యక్తిగత స్నేహ బంధాలు పార్టీ అంతర్గత వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలు ఈ స్నేహ సమీకరణాలను అంగీకరించలేకపోతున్నారు. ఇది అధిష్ఠానం వద్ద ఆయన క్రెడిబిలిటీని కొంత దెబ్బతీసిందని లీకులు వస్తున్నాయి. ఈ భిన్నమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, కష్టపడే యువ నాయకత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు.. బొండా సిద్ధార్థ్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.







