తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేపట్టిన సుదీర్ఘ విచారణలో పలు దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన పలువురు ఉన్నతాధికారులతో పాటు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన టీటీడీ (TTD) అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీబీఐ జారీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ప్రక్షాళనకు ఉపక్రమించింది.
ఇందులో భాగంగానే, ఈ కుంభకోణానికి సంబంధించిన విచారణలో సీబీఐ సేకరించిన కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులతో పంచుకుంది. ఆ సమాచారం మరియు అందిన పలు విశ్వసనీయ ఫిర్యాదుల ఆధారంగా, ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా విధులు నిర్వహిస్తున్న మెండు లోకనాథంను టార్గెట్ చేస్తూ ఏసీబీ అధికారులు భారీ మెరుపు దాడులకు దిగారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచే ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు ఏకకాలంలో మొత్తం ఐదు ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
తిరుపతిలోని పెదకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంతో పాటు తిరుమలలోని ఆయన కార్యాలయం, ‘బి టైప్ 53’ నంబరు గల క్యాంపు నివాసంలో అధికారులు రికార్డులను జల్లెడ పడుతున్నారు. లోకనాథం గతంలోనూ వివిధ హోదాల్లో టీటీడీలో సుదీర్ఘకాలం పనిచేసిన కాలంలో ఆదాయానికి మించి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. దాడులు జరుగుతున్న సమయంలో లోకనాథం తన ఇంట్లోనే ఉన్నారు.
ఈ తనిఖీలలో భాగంగా లోకనాథం బంధువుల ఇళ్లను కూడా ఏసీబీ వదిలిపెట్టలేదు. తిరుపతిలో నివసిస్తున్న ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు, ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలోని ఆయన సోదరుడి నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, తిరుపతి ఎస్టీవీ నగర్ బ్రాంచ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోకనాథం పేరిట ఉన్న బ్యాంక్ లాకర్లను సైతం అధికారులు తెరిచి నిశితంగా పరిశీలిస్తున్నారు. టీటీడీ వంటి అత్యంత పవిత్రమైన ధార్మిక సంస్థలో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక ఉన్నతాధికారి నివాసాలపై ఈ స్థాయిలో ఏసీబీ దాడులు జరగడం తిరుపతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.







