ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం ఒక అసాధారణ రికార్డును సృష్టించింది. ఎలాంటి భారీ హంగులు, ఆర్భాటాలు, ఊకదంపుడు ప్రసంగాలు లేకుండా.. కేవలం 48 గంటల వ్యవధిలోనే దశాబ్దాల నాటి రెండు మెగా ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల రైతన్నల చిరకాల స్వప్నమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశ విజయవంతంగా ప్రారంభమైంది.
సుమారు ₹7,983 కోట్ల వ్యయంతో, నల్లమల కొండల గుండా 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు జంట సొరంగాల మార్గం ద్వారా కృష్ణా జలాలను తరలించి, మెట్ట ప్రాంతాల ఎండిపోయిన భూములకు జీవధారలు పోశారు. దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. మరోవైపు గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్రారంభమైంది.
తూర్పు కనుమలను తొలిచి, అత్యంత క్లిష్టమైన భౌగోళిక సవాళ్లను అధిగమిస్తూ నిర్మించిన ఈ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర దిశగా పరవళ్లు తొక్కాయి. ఈ అనుసంధానంతో ఉత్తరాంధ్రలోని దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందబోతోంది. కేవలం మాటల గారడీలు కాకుండా, భూసేకరణ సమస్యలు తీర్చి, నిధులు సర్దుబాటు చేసి రాత్రింబవళ్లు శ్రమించి కూటమి ప్రభుత్వం సాధించిన ఈ అద్భుతం ఏపీ వ్యవసాయ రంగంలో సరికొత్త హరిత విప్లవానికి నాంది పలికింది.







