తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ ఊహించని విధంగా అత్యంత సంచలన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరియు ఆమె భర్త కొండా మురళి సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కొండా దంపతులు అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లోనే కొండా సురేఖ తన మంత్రి పదవికి మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఉదయమే తమ ముఖ్య అనుచరులందరినీ హైదరాబాద్కు చేరుకోవాలని కొండా దంపతులు ఆదేశించడంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.
దిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధిష్ఠానం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతోనే కొండా సురేఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో అధిష్ఠానం బర్తరఫ్ వేటు వేసే కంటే, గౌరవంగా తామే రాజీనామా చేయడం బెటర్ అని కొండా దంపతులు భావిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కేవలం మంత్రి పదవి మాత్రమే ఊడిపోతే.. అవమాన భారాన్ని మోస్తూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం కంటే బయటకు వచ్చేయడమే సరైన మార్గమని వారు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పే యోచనలో కొండా సురేఖ ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జరగబోయే మీడియా సమావేశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేసినా తమకు సరైన గుర్తింపు ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారని కొండా దంపతులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ అధిష్ఠానం తీరును, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కొండా దంపతులు పూర్తిగా ఏకిపారేసే అవకాశం ఉందని వారి అనుచర వర్గాలు చెబుతున్నాయి. సామాజిక న్యాయం పేరుతో తాము లేవనెత్తిన అంశాలను పక్కనబెట్టి తమపైనే వేటు వేయడానికి సిద్ధమవ్వడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. 3 గంటల ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి కుదుపు రాబోతోందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.







