ప్రకాశం జిల్లా నల్లమల ప్రాంత రైతాంగ కల అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘క్రెడిట్ వార్’ ముదిరింది. ఈ ప్రాజెక్టును తానే పూర్తి చేశానంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జగన్ మార్కు పబ్లిసిటీ రాజకీయాలను ఎండగడుతూ మంత్రి లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. 2024 లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజంగానే ఒక పెద్ద చరిత్ర సృష్టించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాజెక్టులో చుక్క నీళ్లే లేకపోయినా.. అసంపూర్ణంగా ఉన్న ఆ వెలిగొండ ప్రాజెక్టును ఆనాడు అత్యంత ఘనంగా ప్రారంభించేశారని మండిపడ్డారు. కాలువలు, పునరావాస పనులు పూర్తి చేయకుండా, ప్రజలకు కనీసం ఉపయోగపడేలా నీటి విడుదల కూడా చేయకుండా కేవలం ప్రారంభోత్సవాల బోర్డులు తగిలించుకోవడం జగన్కే చెల్లిందని దుయ్యబట్టారు.
ఇలాంటి నకిలీ ప్రారంభోత్సవాలు చేయడం, ప్రజలను మభ్యపెట్టడం కేవలం వైకాపా ప్రభుత్వానికే సాధ్యమంటూ లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే యుద్ధప్రాతిపదికన పెండింగ్ పనులను, నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులను పూర్తి స్థాయిలో క్లియర్ చేసి.. ఈరోజు అధికారికంగా నల్లమలసాగర్కు కృష్ణా జలాలను విడుదల చేశామని స్పష్టం చేశారు. అసంపూర్ణ కట్టడాలకు రంగులు వేసుకుని తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు.







