ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఈ రోజు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించారు. పండగ వాతావరణం నడుమ క్రిష్ణా జలాలను నల్లమలసాగర్ కు విడుదల చేశారు. ప్రాజెక్టు తొలి దశని జాతికి అంకితం చేశారు. తొలి దశలో ఒక లక్షా 19 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఎన్నే ఏళ్ల కల నిజమవడంతో పశ్చిమ ప్రకాశం ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో మా నాయకుడిదే ప్రధాన పాత్ర అని, వైసిపి ప్రచారం చేసుకుంటోంది. ప్రాజెక్టు పూర్తికాకుండానే, జగన్ దీన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.
అప్పటికి శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలించే సొరంగాల పనులు పూర్తి కాలేదు. ఒక సొరంగంలో టన్నెల్ బోర్ మిషన్ ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీయలేమని వదిలేశారు. నిర్వాశితులకు పరిహారాలు ఇవ్వలేదు. చుక్క నీరు కిందికి వదల్లేదు. కానీ ప్రాజెక్టు పూర్తయిందని ప్రకటించారు. చంద్రబాబు మళ్లీవచ్చాక ఈ రెండేళ్లలో 900 కోట్లకు పైగా నిర్వాశితులకు పరిహారం కింద అందించారు. టన్నెల్ బోర్ మిషన్ బయటకు తీశారు. సొరంగాలకు, ప్రధానకాల్వలకు లైనింగ్ పనులు పూర్తి చేసి ఇవ్వాళ జాతికి అంకితం చేశారు. జగన్మోహనరెడ్డి ఈప్రాజెక్టు కోసం అయిదేళ్ల కాలంలో బడ్జెట్లో 4 వేల కోట్లు కేటాయించి 900 కోట్లు ఖర్చు పెట్టారు. నిజానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు మొత్తం మంజూరు చేసి వుంటే జగన్మోహనరెడ్డికి ఈప్రాజెక్టుని ప్రారంభించే అవకాశం దక్కేది.
ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేది. కానీ జగన్ వైఫల్యం చంద్రబాబుకు అవకాశంగా మారింది. తిరిగి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో తొలిదశని పూర్తి చేసి ప్రారంభించారు. రెండో దశని కూడా సాధ్యమైనంత త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది, ప్రారంభోత్సవం చేసిందీ ఆయనే. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు. శంకుస్థాపన చేసింది చంద్రబాబే. ప్రారంభోత్సవ సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబే. దీన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించారు. జగన్మోహనరెడ్డి మూడేళ్లు పనులు ఆపేసి, అధికారంలో నుంచి దిగిపోయే చివరి ఏడాదిలో ఈ ఎయిర్పోర్టు పనులు ప్రారంభించారు. ఆపకుండా వుంటే ఈ ప్రారంభోత్సవం కూడా ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడే జరిగేది. ఇక రాష్ట్రానికి గేమ్ చేంజర్ ప్రాజెక్టులు పోలవరం, అమరావతి. వీటి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబుకు అవకాశంగా మారాయి.
విభజన తరువాత రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు పోలవరం. పోలవరం రెండు దశలు పూర్తయితే విశాఖ పట్నం నుంచి ఒంగోలు వరకు గోదావరి నీళ్లు పారించే అవకాశం వుంది. డెల్టా, సాగర్ ఆయకట్టుకిచ్చే క్రిష్ణా నీళ్లని పైన శ్రీశైలం నుంచి రాయలసీమకు ఇవ్వొచ్చు. అంత ప్రాముఖ్యత వుంది కాబట్టే చంద్రబాబు సోమవారం పోలవారం అంటూ పనులు పరుగెత్తించారు. జగన్ వచ్చాక పనులు ఆపేశారు. ఆ తరువాత రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్లని మార్చాడు. ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులని మళ్లించాడు. దీంతో ప్రాజెక్టు లేటయింది. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పునరావాసకార్యక్రమాలు కూడా పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాదికి తొలిదశని ప్రారంభించబోతున్నారు.
ఇది కూడా చంద్రబాబు చేతుల మీదుగానే జరుగుతుంది. జగన్ ఆలస్యం చెయ్యకుండా వుంటే, నిధులు డైవర్ట్ చెయ్యకుండా వుంటే ఇది కూడా జగన్ చేతుల మీదుగానే ప్రారంభయ్యేది. ఇక రాజధాని అమరావతి. దేశంలో ఏ రాష్ట్ర ప్రజలైనా మా రాజధాని నగరం ఇది అని గర్వంగా చెప్పుకుంటారు. జగన్ ఆ అవకాశం లేకుండా చేశాడు. చంద్రబాబు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు కాబట్టి నేనెందుకు పూర్తి చెయ్యాలని మూర్ఖపు ఆలోచనతో రాజధానిని ఆపేశాడు. మూడు రాజధానుల పేరుతో అయిదేళ్లు డ్రామా నడిపాడు. ఆ అయిదేళ్లు పనులు కొనసాగి వుంటే అమరావతి పూర్తయ్యేది.
ప్రతిష్టాత్మకమైన రాజధాని ప్రారంభోత్సవం జగన్ హయాంలో జరిగుండేది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాజెక్టులన్నీ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవి. భవిష్యత్ తరాలు చెప్పుకునే ప్రాజెక్టులు. ఒక నగర నిర్మాతగా, రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేసినవాడిగా చంద్రబాబుని భవిష్యత్తరాలు చెప్పుకుంటాయి. ఈ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని జగన్మోహనరెడ్డి తన మూర్ఖపు పంతాలతో కోల్పేతే, చంద్రబాబునాయుడు ఆ అద్రుష్టాన్ని దక్కించుకున్నారు.







