వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా కాంగ్రెస్లో రాజకీయాలు చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహాన్ని ఘనంగా జరిపించిన షర్మిల, ఇప్పుడు తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు వైఎస్ షర్మిల మరియు ఆమె భర్త అనిల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తమ కుమార్తె పెళ్లి నిశ్చయమైనట్లు అధికారికంగా ప్రకటించడంతో వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డిని చేసుకోబోయే వరుడి పేరు డాక్టర్ సోమాల రఘురామ్ రెడ్డి. ఈయన అమెరికాలో స్థిరపడిన ఒక ప్రముఖ వైద్యుడు. రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులు శ్రీ సోమాల సుబ్బా రెడ్డి మరియు శ్రీమతి సోమాల పద్మా రెడ్డి. ఈ వరుడి కుటుంబ సభ్యులందరూ ప్రస్తుతం అమెరికా పౌరులే అయినప్పటికీ, వారి అసలు స్వస్థలం మాత్రం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లా కావడం విశేషం. “మా కుమార్తె వై.ఎస్. అంజిలి రెడ్డి వివాహం డాక్టర్ సోమాల రఘురామ్ రెడ్డితో నిశ్చయమైన శుభవార్తను ఎంతో ఆనందంగా మీతో పంచుకుంటున్నాము. మా కుటుంబానికి మీ అందరి ప్రార్థనలు, ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము” అని షర్మిల తన పోస్ట్లో పేర్కొన్నారు.
వైఎస్ఆర్ మనవరాలైన అంజిలి రెడ్డి చదువు, కెరీర్ వివరాల్లోకి వెళ్తే.. ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుండి BBA Finance (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఫైనాన్స్) డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో అంజిలి రెడ్డి ఫైనాన్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నప్పుడు షర్మిల సోషల్ మీడియాలో ఎంతో గర్వంగా ఆ ఫోటోలను షేర్ చేశారు. చదువు ముగిసిన కొద్ది కాలానికే ఆమెకు నచ్చిన, ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్ రఘురామ్ రెడ్డితో పెళ్లి కుదరడంతో వైఎస్ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. గతంలో కుమారుడి పెళ్లికి ఏపీ, తెలంగాణ రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్లే.. ఈ వివాహానికి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.







