తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం జాతీయ స్థాయిలో మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం లండన్ పర్యటన ముగించుకుని ఆయన ఆగస్టు 24న హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. అయితే, నిబంధనల సాకుతో కేంద్రం ఈ పర్యటనను అధికారికంగా తిరస్కరించినప్పటికీ, దీని వెనుక అత్యంత ఆసక్తికరమైన అంతర్జాతీయ రాజకీయ వ్యూహం మరియు నిఘా వర్గాల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, రేవంత్ రెడ్డి అక్కడ చేయబోయే పర్యటనలపై కేంద్రానికి అందిన సమాచారమే, అనుమతి రాకపోవడానికి కారణం అంటున్నాయి మీడియా వర్గాలు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు వారు ప్రతిపాదించే షెడ్యూల్, వారు నిర్వర్తిస్తున్న పదవికి మరియు పర్యటన ఉద్దేశానికి తగిన విధంగా ఉండాలి. విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సైతం ఈ పర్యటన నిబంధనల ప్రమాణాలకు అనుగుణంగా లేనందుకే అనుమతి నిరాకరించామని స్పష్టం చేశారు. అయితే, అంతర్గత సమాచారం ప్రకారం.. అమెరికాలో కొన్ని వర్గాల ద్వారా ట్రంప్ లేదా కనీసం జేడీ వాన్స్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడానికి ప్రయత్నాలు జరిగాయని భారత నిఘా వర్గాలకు పక్కా సంకేతాలు అందాయని జాతీయ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే అభద్రతా భావంలో ఉన్న బీజేపి అధిష్టానం, రేవంత్ గనుక ఈ భేటీ నిర్వహిస్తే, మరింత ఆందోళన చెందే అవకాశం ఉండవచ్చు. దీని వెనుక అంతర్గత లెక్కలు ఉన్నాయనే భయం కూడా బిజెపిని వెంటాడే అవకాశం ఉంటుంది. ఒక దేశ కీలక నేతలతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జరిపే భేటీలు పూర్తిగా అంతర్జాతీయ ప్రొటోకాల్ మరియు దేశ విదేశాంగ విధానంతో ముడిపడి ఉంటాయి. ఈ అత్యంత కీలకమైన భేటీల వివరాలను, సీఎం పర్యటన ఏర్పాట్లను ఎవరు పర్యవేక్షిస్తున్నారనే సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం తన ముందస్తు షెడ్యూల్ ప్రతిపాదనల్లో విదేశాంగ శాఖకు పొందుపరచలేదు. ఈ సమాచార లోపం మరియు భద్రతా, దౌత్యపరమైన కారణాల దృష్ట్యానే కేంద్రం ఈ పర్యటనకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తిగా “రాజకీయ కోణంలోనే” తన పర్యటనను అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణను అంతర్జాతీయ విద్యా హబ్గా మార్చేందుకు, హార్వర్డ్, ఎంఐటీ వంటి విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా తాను ఈ టూర్ ప్లాన్ చేశానని, దీనిపై రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. అయితే, కేంద్రం తనను అడ్డుకున్నప్పటికీ రాష్ట్ర ప్రగతి ఆగదని స్పష్టం చేసిన సీఎం, తనతో పాటు వెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని మాత్రం అమెరికాకు పంపించారు. ముందుగా నిర్ణయించిన విద్యాసంస్థలతో చర్చలు జరిపి, పెట్టుబడులు మరియు ఒప్పందాల ప్రక్రియను అధికారులు యథాతథంగా పూర్తి చేస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.







