మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలకు విరుద్దంగా ప్రజలనుంచి డిపాజిట్లు వసూలు చేస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన రెండు దశాబ్దాలుగా చేసిన పోరాటానికి సుప్రీం కోర్టు శుభం కార్డు వేసింది. సుప్రీంకోర్టు తీర్పుని అందరూ స్వాగతించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇది నిజాయతీకి దక్కిన మహోన్నత విజయం అని పేర్కొన్నారు. ఐవైఆర్ లాంటి కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యానాలు ఉండవల్లి అరుణ్ కుమార్ మీద విమర్శలు చెయ్యడానికి ఎల్లోమీడియాకి ఒక మంచి అవకాశం ఇచ్చాయన్నారు.
చట్టపరంగా ఓడిపోవడానికి సాంకేతికంగా అనేక కారణాలుంటాయన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించిన సందర్భంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి పిటిషన్ వేసి, పోరాడటానికి అసలు మీకున్న అర్హత ఏమిటని ధర్మాసనం ఉండవల్లిని నిలదీసింది. ఇది ఎక్కడా ప్రజా ప్రయోజన వ్యాజ్యంలా లేదని, పూర్తిగా ఒక వ్యక్తిగత వివాదంలా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.మీరు డిపాజిటర్ కానప్పుడు మీకేంటి ప్రాబ్లం అని అడిగింది. నిజానికి ఇది వ్యక్తిగత స్పర్ధే. రాజకీయ స్పర్ధ. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, అప్పుడు జరుగుతున్నకుంభకోణాల మీద కథనాలు రాస్తున్న ఈనాడుపై కక్ష కట్టారు.
ఆయనకు విశ్వాసపాత్రుడిగా చెప్పుకునే ఉండవల్లి తో రామోజీరావుగారిని ఇబ్బంది పెట్టడానికి మార్గదర్శి మీద కేసులు వేయించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని ఉండవల్లి ఫిర్యాదు చేశారు. రామోజీరావు ఆర్ధిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో ఈ కేసులు వేశారు. రాజకీయ, వ్యక్తిగత స్పర్ధతోనే ఉండవల్లి ఈ కేసులు సుదీర్ఘకాలం నడిపారు. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి అనుకూలంగా తీర్పొస్తే సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. చివరకు సుప్రీంకోర్టు కూడా ఉండవల్లి పిటిషన్ని కొట్టేస్తూ, వ్యక్తిగత స్పర్ధ దీనికి కారణమన్నట్టు వ్యాఖ్యానించింది.
ఈ తీర్పు వెలువడ్డాక ఉండవల్లి అరుణ్ కుమార్ తీర్పుని స్వాగతిస్తూనే, తాను పిటిషన్ వెయ్యడం వల్ల రామోజీరావు ఆస్తులమ్మి డిపాజిటిర్లకుడబ్బులు చెల్లించారని, అది తన పోరాటం వల్లే సాధ్యమైందని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మార్గదర్శి సంస్థ తమ చందాదారులకు ఎప్పుడో సుమారు రూ. 2,591 కోట్లకు పైగా డిపాజిట్లను పూర్తిగా చెల్లించింది. సంస్థ ఎప్పుడూ కూడా తన ఖాతాదారుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు.. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు డిపాజిటర్లు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని విస్తృతంగా బహిరంగ ప్రకటనలు జారీ చేశారు. డిపాజిట్లు చెల్లించారు.ఉండవల్లి వ్యవహారం కిందపడ్డా నాదే పైచేయన్నట్టుగా వుంది. కింది కోర్టు నుంచి పైకోర్టు వరకు ఉండవల్లి వాదనని తిరస్కరించాయి. పైగా ఏదో స్పర్ధ పెట్టుకుని చేసినట్టుంది, పిటిషనర్ వాదన వినే కొద్ది అనుమానాలు పెరుగుతున్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
రామోజీరావుని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే ఈ కేసు వేసినట్టు అందరికీ అర్ధమవుతుంది. మార్గదర్శి సంస్థల మీద పెద్ద ఎత్తున విషప్రచారం చేసినప్పటికీ, ఒక్క డిపాజిటర్ కూడా మార్గదర్వి మాకు అన్యాయం చేసిందని ముందుకు రాలేదు. ఫిర్యాదు చెయ్యలేదు. అంతకుముందు కూడా కాలపరిమితి ముగిసిన వెంటనే డిపాజిటర్లకు డబ్బు చెల్లించారు. ఎక్కడా ఒక్క ఫిర్యాదు కూడా లేదు. ఉండవల్లి ఇప్పుడు తన వల్లే డిపాజిటర్లకు డబ్బులిచ్చారని చెప్పుకోవడం నా కోడి కుయ్యడం వల్లే తెల్లారిందన్నట్టుంది. మార్గదర్శిపై పోరాటంలో ఓడిపోయిన తరువాత సమర్థించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఒక పథకం ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో ఎంతో క్రెడిబిలిటీ వున్న సంస్థని బద్నాం చెయ్యడానికి, రామోజీరావుగారిని వ్యక్తిత్వాన్ని దెబ్బతియ్యడానికి వైఎస్ సహకారంతో ఉండవల్లి చేసిన కుట్రలు, పన్నిన వ్యూహాలు విఫలమయ్యాయి.







