26 C
Vijayawada
Tuesday, August 25, 2026
Homeఆంధ్రప్రదేశ్బయటకొస్తే శాల్తీ గల్లంతవుతుంది.. అది ఏపీ కదా.. ! సుప్రీం న్యాయమూర్తి సంచలన...

బయటకొస్తే శాల్తీ గల్లంతవుతుంది.. అది ఏపీ కదా.. ! సుప్రీం న్యాయమూర్తి సంచలన వ్యాఖ్య!

మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వున్నఫ్యాక్షన్, ముఠా కక్షల గురించి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనే దేశంలో కూడా ఘనంగా చెప్పుకుంటున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల కామెంట్స్ వింటే ఫ్యాక్షన్ని పెంచి పోషించిన నేతలు సిగ్గుతో తలదించుకోవాలి. కడప జిల్లాకు చెందిన వెన్నపూస చిన్నారెడ్డి అనే వ్యక్తి ఒక హత్య కేసులో నిందితుడు. 2009లో ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ట్రయల్ కోర్టు వేసిన శిక్షని, హైకోర్టు సమర్థించింది. దీంతో అతను సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు.

పదేళ్లుగా జైల్లో వున్నాడు కాబట్టి, సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు బెయిల్ ఇవ్వాలని అతని న్యాయవాది అభ్యర్థించాడు. అయితే సుప్రీం కోర్టు ఆ అభ్యర్ధనని తిరస్కరించింది. కింది కోర్టులు రెండూ మీకు వ్యతిరేకంగాతీర్పులిచ్చాయి. మీకు బెయిలిస్తే మీరు బయటకొస్తే మరొక 302 కేసు నమోదయ్యే అవకాశంవుంది. మీరు హత్యకుగురి కావచ్చు. లేదా మరొకరినైనా చంపొచ్చు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా.. కచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని జస్టిస్ అర్వింద్ కుమార్ వ్యాఖ్యానించారు. బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పారు.

ఇక్కడ చిన్నారెడ్డి హత్య చేశాడా? లేదా? అతనికి బెయిల్ ఇవ్వాలా? వద్దా అనే విషయం కంటే ఆసక్తికరమైన విషయం ఏపీ గురించి న్యాయమూర్తులకు, బయట రాష్ట్రాల వాళ్లకి వున్న అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలకు, ప్రతీకార హత్యలకు పేరు మోసిన రణస్తలం అనే అభిప్రాయం వుందని అర్ధమవుతోంది. దీనికి కారకులెవరు? తమ రాజకీయ మనుగడ కోసం, అధికారం కోసం ఫ్యాక్షన్ని ఎంకరేజ్ చేసిన నాయకుల వల్ల ఏపీకి ఈ దుస్థితి ఏర్పడింది. చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీకున్న ఇమేజ్ ని మార్చారు. ఏపీ అంటే ప్రోగ్రెసివ్ స్టేట్ అనే గుర్తింపుని జాతీయ స్థాయిలో తీసుకొచ్చారు. హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ రంగం వేళ్లూనుకోవడానికి, డెవలప్ కావడానికి చంద్రబాబే పునాదులు వేశారు. ఏపీకి ఒక బ్రాండ్ తీసుకొచ్చారు.

రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అణచివేశారు. సొంత పార్టీలో పరిటాల రవి లాంటి వాళ్లకు కూడా పగ్గాలు వేసి అదుపుచేశారు. ఆ తరువాత వైస్సార్ సీఎం అయ్యాక సీమలో హత్యారాజకీయాలు నడిచాయి. పరిటాల, కేతిరెడ్డి లాంటి నేతలని హత్య చేశారు. రాష్ట్ర విబజన తరువాత జగన్ హయాంలో ప్రతీకార రాజకీయాలు నడిచాయి. స్థానిక ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు, విపక్ష నేతల అరెస్టులు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీశాయి. శాంతిభద్రతల పరంగా, పెట్టుబడుల పరంగా, పాలనాపరంగా టోటల్ గా ఏపీ బ్రాండ్ దెబ్బతింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు చేసిన ఈవ్యాఖ్యలనుబట్టి జాతీయ స్థాయిలో ఏపీకి ఎలాంటి పేరుందో ప్రజలు గమనించాలి.

కొన్ని దశాబ్దాలుగా రాయలసీమ తో పాటు మరి కొన్ని జిల్లాల్లో ఫ్యాక్షనిస్టుల అరాచకాల వల్లే అందరిలో ఇలాంటి అభిప్రాయం ఏర్పడింది. రాయలసీమలో పాలెగాళ్ల పేరుతో పౌరహక్కులసంఘం వాళ్లు వేసిన పుస్తకాల్లో ఈ ఫ్యాక్షనిస్టుల అరాచకాలు పూసగుచ్చినట్టు రాశారు. రాజకీయ ప్రయోజనాల కోసం హత్యా రాజకీయాలు, దాడులు ప్రోత్సహించే నేతలకు ప్రజలు బుద్ధి చెప్పనప్పుడు, రప్పా రప్పా బ్యాచ్ లకు మద్దతిచ్చే నేతలను ఎన్నుకున్నప్పుడు ఇలాంటి చెడ్డపేరే వస్తుంది. దేశ విదేశాల్లో వున్నఆంధ్రులు సిగ్గుతో తలొంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments