30 నెలల్లో చూస్తారు ఏపీలో ఏం జరగబోతోందో, ఏపీలో సాగుతున్నది చేతగాని పాలన – ఇక యుద్ధమే అంటోంది బీజేపీ. అధికారిక అరాచకానికి ఎలా అడ్డుకట్ట వేస్తామో చూపిస్తాం, మా శక్తి సామర్థ్యం ఏంటో నిరూపిస్తామని సుజనా ఓపెన్ ఛాలెంజ్ చూశాక ఇప్పుడు ఏకంగా బహిరంగ సభే పెడుతోంది ఆ పార్టీ. ఏంటి సంగతి ? ఏపీలో రాజకీయంగా వేక్యూమ్ ఉందా ? మూడో పార్టీకి జాగా ఉందా ? అధికార విపక్క్షాలు తన్నుకోవడమే ధ్యేయంగా రాజకీయం సాగుతున్న రాష్ట్రంలో అసలు జనం మాట ఎక్కడైనా వినిపడుతోందా ? ఆల్రెడీ ఉన్న జనసేనకి తోడు ఇంకొకాయన కూడా పార్టీ పెడతా అంటూ హడావుడి చేస్తున్న టైమ్ లో అసలు తేవాల్సిన పాయింటు ఇదే ! ఏపీలో మూడో పార్టీ ఎమర్జ్ కాగలదా ?
ఏపీ రాజకీయాల్లో వారసత్వం వెర్రితలలు వేసింది. వారసత్వాన్ని చూసి ఓసారి ఛాన్సు ఇచ్చి చేతులు కాల్చుకున్న జనం ఇప్పుడు ఇంకోపక్కకు తిరిగినా ఇంచుమించు ఇదే చిత్రం కనిపించే పరిస్థితి. మేం సమర్థించడానికి సమర్థతతో పని లేదు, వారసత్వం ఉంటే చాలు అన్నట్టు తయారైంది రాజకీయ అభిమానం. గత్యంతరం లేని పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో ఓసారి ఓటు వేసినా ఆ తర్వాత అయినా వారసత్వం వర్సెస్ నాయకత్వం అనే యుద్ధం ఏపీలో జరగడం ఖాయం. వారసులు కావాలా ? నాయకులు కావాలా ? అనే స్లోగన్ కి ఏపీలో వెయిట్ పెరిగి తీరుతుంది. ఇప్పుడంటే రాజకీయ కొట్లాట ముదిరి, రెండున్నరేళ్లలోనే అనూహ్యంగా మారిపోతున్న పరిస్థితుల్లో ఈ విషయం అర్థం కావడం లేదేమో కానీ మరో మూడు నాలుగేళ్లలో ఏపీ సమాధానం చెప్పి తీరాల్సిన అతి పెద్ద ప్రశ్న ఇదే ! వారసత్వం కావాలా నాయకత్వం కావాలా అని !
అందుకే థర్డ్ ఆల్టర్ నేటివ్ అనేది ఏపీ రాజకీయాల్లో కీలకం. ఆల్రెడీ జనసేన ఉంది. బీజేపీతో పొత్తులో ఉంది. ఆ రెండింటినీ కలిపి మూడో పార్టీ అనుకోవచ్చు కదా అంటారేమో ! కొంత వరకూ కరెక్టే. పూర్తిగా కాదు. ఎందుకంటే రెండు ఎస్టాబ్లిష్డ్ పార్టీల మీద పోరాటం చేయాలి, వాటికి దీటుగా నిలదొక్కుకోవాలీ అంటే మాట వరసకు ఉంటే సరిపోదు. జనంలో ఉండాలి. జనంతో ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో కనిపించాలి. జనసేనలో మేజర్ డ్రా బ్యాక్ ఇదే. పవన్ మాట్లాడితే పార్టీ ఊపులో ఉన్నట్టు. పవన్ షూటింగ్ లో ఉంటే పార్టీ లీవ్ లో ఉన్నట్టు. దేర్ ఈజ్ నో సెకండ్ లేయర్ అండ్ ప్రోపర్ సిస్టమ్ అనుకుంటా – అనిపిస్తది. ఇది విమర్శ కాదు. ప్రశాంతంగా ఆలోచిస్తే ఇట్టే తట్టే వాస్తవం. మరి బీజేపీ సంగతి ? కాస్త ఆలస్యంగా ఆ పార్టీ తేరుకున్నట్టు కనిపిస్తోంది. వీర్రాజు, జీవీఎల్ లాంటి నాయకులు వైసీపీ ఫ్రాంఛైజీకి లీడర్ల తరహాలో మాట్లాడేవాళ్లు మొన్నటి వరకూ ! ఇప్పుడు ప్రజా ఆగ్రహ సభ అంటోంది బీజేపీ. ఈ మధ్యలో – మేం వస్తున్నాం, తేల్చుకుంటాం, కేంద్రం లెక్కలన్నీ తీస్తోంది, ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు అని విశాఖలో సుజనా ప్రకటన చేయడం ఓ మలుపు. ఇంతకీ జనం మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు ఏపీలో ?
ఏపీలో మూడు రకాల జనం ఉన్నారు ఆలోచనలను బట్టీ. ఆ పార్టీ. ఈ పార్టీ. నో పార్టీ. మొదటి రెండు పార్టీల అభిమానులు, విధేయులు… లాజిక్కులతో సంబంధం లేకుండా ఐడియాలజీని బట్టీ విడిపోయారు. వాళ్లు ఏం చేసినా వీళ్లు ఖండిస్తాడు. వీళ్లు ఏం మాట్లాడినా వాళ్లు తప్పుపడతారు. ఇష్యూ బేస్డ్ గా ఏదీ జరగదు. సపోజ్ ఇళ్ల వ్యవహారం తీసుకోండి. ఊరతల చెరువుల మధ్యలో సెంటు భూమి ఇచ్చి చేతులు దులుపుకొన్నారు అంటూ అప్పొజిషన్ వీడియోలు చేసి వైరల్ చేస్తుంది. అటు ప్రభుత్వమేమో అద్భుతంగా కట్టామని చెప్పుకుంటుంది. అంతకు మించి అడుగు ముందుకు పడదు. అంతేకానీ, ఈ ఇళ్ల పథకం కోసం 2019కి ముందు ఆల్రెడీ వేల కోట్లు ఖర్చు పెట్టారు. అందులో చాలా వరకూ కేంద్రం డబ్బులు కూడా ఉన్నాయ్. లబ్దిదారుల చిట్టా కూడా సిద్ధం చేశారు. వాళ్లందరినీ ఏకం చేసి, మాకు ఎందుకు న్యాయం చేయరు అని అడిగించడం కానీ, ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లడం కానీ – ఆ కట్టిన ఇళ్లను పాడుపెడుతున్నారని న్యాయపోరాటం చేయడం కానీ జరగవ్. ఎందుకంటే ఆ పార్టీకి పేరు రాకూడదని వీళ్లు అనుకుంటారు. ఈ పార్టీ చేసేవి ఏవీ జరక్కూడదని ఆ పార్టీ అనుకుంటుంది. ఈ పోరాటం మధ్యలో జనం నలుగుతూ ఉంటారు. ఈ పాయింట్ ని పట్టుకుంటే ఎమర్జ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అంత ఆలోచన, అంతకు మించిన వ్యవస్థ, జనంలోకి తీసుకెళ్లి అర్థమయ్యేలా, ఉద్ధృతంగా చెప్పగలిగే మెకానిజం ఎవరికి ఉంది – అనేదే పాయింటు.
ఆలోచనాపరుల్ని ఆకట్టుకోవాలి. ఇన్ ఫ్లూయెన్సర్లను పట్టుకోవాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి పదేళ్లు బాల్యం. చిన్నతనం బలిష్టంగా ఉంటేనే పటిష్టంగా ఎదిగేది, నిలబడేది ! అలా కాకుండా, రాజధాని లేని, కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చుకోలేని అధోగతిలో ఉంటే ఇంకా బతుకేముంటుంది ? భవిష్యత్ ఏముంటుంది ? ఇలాంటి మౌలికమైన ప్రశ్నలకి సమాధానం వెదకాల్సిన టైమ్ ఇది. అప్పుడు ఐదేళ్లు – ఇప్పుడు ఐదేళ్లు ఆల్రెడీ చూశాం. చూస్తున్నాం. ఇద్దరిలో రవ్వంత మెరుగ్గా ఉన్న వాళ్ల వైపు మొగ్గడం మార్గమా ? లేదంటే మనం మరో రహదారి వేయలగమా ? అనేది తేల్చేది, ఆలోచించేది, భవిష్యత్ ను నిర్మించేదీ ఈ మేధోవర్గమే ! ఇలాంటి వాళ్లు ఇప్పుడు ఏపీకి అవసరం. అరాచకాన్ని ప్రశ్నించని, ప్రతీ విషయాన్నీ కులం కళ్లద్దాలతో మాత్రమే చూస్తూ ఉండిపోతున్న సమాజంలో ఆలోచన నిద్రలేస్తే – ఆల్టర్ నేటివ్ ఆటోమేటిగ్గా పుట్టుకొస్తుంది. 30 నెలల్లో చూస్తారు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి వస్తుంది అంటున్న సుజనా లాంటి నాయకులు ఆ రకమైన ప్రయత్నాలు చేస్తారేమో చూద్దాం. చేస్తే మాత్రం మూడో కన్ను తెరిచేందుకు ఏపీ సిద్ధపడుతుందేమో !